తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈ రోజు చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మణి నాయుడు, బోర్డు మెంబర్ కొత్తపల్లి శివప్రసాద్ స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. దర్శనానంతరం, రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధి మరియు కళాకారుల సంక్షేమం దృష్ట్యా, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ షోరూమ్ల విస్తరణకు సంబంధించి వివిధ ప్రాంతాలలో అనుకూల స్థలాలను పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో కాణిపాకం ప్రాంతంలో షోరూమ్ ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, కాణిపాకం ఆలయ చైర్మన్ మణి నాయుడు, బోర్డు మెంబర్ శివప్రసాద్ పాల్గొని సంబంధిత వివరాలను సమీక్షించారు.
అలాగే శ్రీకాళహస్తి ప్రాంతంలో కూడా లేపాక్షి షోరూమ్ స్థాపనకు అనువైన స్థలాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి చైర్మన్ కొట్టె సాయి పాల్గొని స్థానిక పరిస్థితులు, సౌకర్యాలపై వివరాలు అందించారు. అనంతరం తిరుపతి శిల్పరామం ప్రాంగణంలో కూడా హస్తకళల ప్రదర్శన మరియు విక్రయాల విస్తరణకు సంబంధించి ప్రదేశాలను సందర్శించి, అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా హస్తకళలకు ప్రోత్సాహం అందించడంలో భాగంగా, లేపాక్షి వంటి సంస్థల ద్వారా కళాకారులకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో షోరూమ్లు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక కళాకారులకు మార్కెట్ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగన్న తులసి ప్రసాద్, నాయకులు పోటుకూరి ఆనంద్, మండల అధ్యక్షులు రాజశేఖర్, శివ, బండారు మనోహర్, పురుషోత్తం, బాలసుబ్రమణ్యం తదితరులు మరియు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News