గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో కీలకమైన లక్ష్మీపురం మెయిన్ రోడ్ మేజర్ డ్రైన్ నిర్మాణ పనులు 4 రోజుల్లో పూర్తి చేయాలని, గత 2 నెలలుగా డ్రైన్ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంపై కాంట్రాక్టర్ కి నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఎస్ఈ ని ఆదేశించారు. శనివారం లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్ ల్లోని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పర్యటించి, పెండింగ్ పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత లక్ష్మీపురం మెయిన్ రోడ్ మేజర్ డ్రైన్ నిర్మాణం, బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు జాప్యంపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిర్మాణ పనులు పొందిన కాంట్రాక్టర్ కి నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్ డ్రైన్ పనులకు అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు సంబందించిన పెండింగ్ పనులను సోమవారంలోపు చేయాలన్నారు. నిర్మాణ పనులు జరిగే సమయంలో సంబందిత ఎమినిటి కార్యదర్శులు అక్కడే ఉండాలని, లేకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు. అనంతరం బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించి, విస్తరణకు అంగీకారం తెలిపిన వారు, కోర్ట్ కేసుల వివరాలు అడిగి తెలుసుకొని, క్లియర్ గా ఉన్న రీచ్ లను ఇంజినీరింగ్ అధికారులకు మార్కింగ్ ఇస్తే డ్రైన్ నిర్మాణ పనులు చేపడతారని సిటి ప్లానర్ కి తెలిపారు. విస్తరణకు అడ్డుగా ఉన్న ట్రాన్స్ఫారాల షిఫ్టింగ్ కు డిడిలు కూడా ఇచ్చినందున విద్యుత్ శాఖ అధికారులు 2 రోజుల్లో షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. కోర్ట్ కేసులు, అంగీకారం ఇవ్వని భవన యజమానులతో రోడ్ విస్తరణ ప్రాధాన్యతని వివరించాలని ఏసిపీని ఆదేశించారు. పనుల వేగవంతంపై నిర్లక్ష్యవైఖరి వీడి, క్షేత్ర స్థాయిలో నిర్దేశిత గడువులోగా ప్రజలకు ఇబ్బందులు రాకుండా వేగంగా జరిగేలా చర్యలు తీసుకోకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
పర్యటనలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపీ రెహ్మాన్, ఈఈలు వేణు, కళ్యాణరావు, డిఈఈలు వెంకటరమణ, సతీష్ కుమార్, విద్యుత్ శాఖ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News