– పుట్టగొడుగుల పెంపకం లాభదాయక స్వయం ఉపాధి మార్గం
– ఎస్హెచ్జీ మహిళలు అవకాశాలను వినియోగించుకోవాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల మహిళలు రైజ్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గొల్లపూడిలోని డీఆర్డీఏ కార్యాలయంలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా పుట్టగొడుగుల పెంపకం. డిజైనింగ్ వస్త్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. పుట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే ఉత్తమ స్వయం ఉపాధి అవకాశమని తెలిపారు. గ్రామీణ మహిళలు ఇంటి వద్ద నుంచే ఈ సాగును చేపట్టి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యకర ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సంప్రదాయ ఉపాధి మార్గాలతో పాటు ఆధునిక వ్యవసాయ ఆధారిత ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, మార్గదర్శకత్వాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఆంత్రప్రెన్యూర్ నాగరాజు మహిళలకు పుట్టగొడుగుల పెంపక విధానం, అవసరమైన ముడి పదార్థాలు, నిర్వహణ పద్ధతులు, మార్కెటింగ్ అవకాశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. తక్కువ స్థలంలో కూడా పుట్టగొడుగుల సాగు చేయవచ్చని, దీని ద్వారా నెలకు మంచి ఆదాయం పొందే అవకాశముందని వివరించారు. శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా లలిత్ ప్రింట్ సంస్థకు చెందిన హైమావతి.. డిజైనింగ్ వస్త్రాలపై మహిళలకు శిక్షణ ఇచ్చారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News