– పరిటాలలో నక్కల వాగు ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక జలధార – జలహారతి పనులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం పరిశీలించారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో జరుగుతున్న నక్కల వాగు ఫీడర్ ఛానల్ పనుల పురోగతిని పరిశీలించారు. కంచికచర్ల ప్రధాన చెరువులో నిల్వ అయ్యే నీరు నక్కల వాగు ద్వారా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు నక్కల వాగులో కలుస్తుందని అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం ఈ నీరు డిస్ట్రిబ్యూటరీ, ఫీల్డ్ చానల్స్ ద్వారా సాగునీటి అవసరాలకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు.
రూ. 2,53,966 అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల ద్వారా భూగర్భ జలాల పెంపుదలతో పాటు సాగునీటి అవసరాలకు గణనీయంగా ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పనుల్లో పాల్గొంటున్న వేజ్ సీకర్స్తో కలెక్టర్ ముచ్చటించారు. రోజుకు ఎంతమంది పనికి వస్తున్నారు, ఉదయం ఎప్పుడు పనులు ప్రారంభిస్తున్నారు, వేతనాలు సకాలంలో అందుతున్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. ప్రస్తుతం 80 మంది కార్మికులు పనుల్లో పాల్గొంటున్నారని, ఉదయం 5.30 గంటలకే పనులు ప్రారంభిస్తున్నామని, ఏప్రిల్ 15 వరకు వేతనాలు జమయ్యాయని, రోజుకు రూ.300 నుండి రూ.307 వరకు వేతనం అందుతోందని వారు కలెక్టర్కు తెలిపారు. పనుల ప్రదేశంలో ఉన్న ముళ్ల పొదలను కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఎన్ఎంఎంఎస్ హాజరు విధానం గురించి డ్వామా పీడీ ఎ.రాము కలెక్టర్కు వివరించారు. ఉదయం 5.30 గంటలకు, తిరిగి ఉదయం 9.30 గంటలకు రెండు విడతల్లో హాజరు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్మికులకు మజ్జిగ పంపిణీ చేసి, పనుల నిర్వహణపై తగిన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పథక సంచాలకులు ఎ. రాము, నందిగామ ఆర్డీవో అనిల్ కుమార్, డీఎల్డీఓ లక్ష్మీకుమారి, ఎంపీడీవో డి. వెంకటేశ్వరావు, ఐ/సి ఎంఆర్వో మానస, ఇరిగేషన్ ఏఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News