విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న “క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ” అమలుకు సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సర్కిల్ 1,2,3 సిబ్బందికి, ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల మీటింగ్ హాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు విడతలుగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శనివారం డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సృజన నిర్వహించారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీలు, వార్డు అమినిటీస్ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, సంబంధిత అధికారులకు శుక్రవారం నాడు శిక్షణ పొందిన ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. నగరంలోని ప్రతి ఆస్తికి సాంకేతిక ఆధారిత డిజిటల్ గుర్తింపును కల్పించడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పౌర సేవలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని డీసీ ఆర్ తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో క్యూఆర్ కోడ్ ఆధారిత డోర్ నంబరింగ్ విధానం అమలు తీరు, యూఎల్బీ సరిహద్దుల నిర్ధారణ, రోడ్ల మ్యాపింగ్, ప్రతి ఆస్తి వివరాల సేకరణ, ప్రాపర్టీ పార్సెల్ మ్యాపింగ్, ఈఆర్పీ డేటా సమన్వయం, ఖచ్చితమైన భౌగోళిక గుర్తింపుల నమోదు తదితర అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. అలాగే ప్రతి ఆస్తికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ జెనరేషన్, డిజిటల్ డేటా సమగ్రత, భవిష్యత్ పట్టణ ప్రణాళికలో ఈ సమాచార వినియోగం వంటి అంశాలపై కూడా సిర్కిల్ అధికారులకు మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు ఏ యు బి శర్మ ,హెలెన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ప్లానింగ్, ఏమినిటీస్, అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News