– 25న చంద్రబాబు ఎంఎస్ఎంఈ ఈవెంట్పై చర్చ
– పార్కుల పురోగతిలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఎంఎస్ఎంఈ పార్కులపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చాలా జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల పనులు నత్తనడకగా ఉన్నాయని.. వచ్చే రెండు నెలల్లో వాటిని ఓ కొలిక్కి తేవాలని సూచించారు. పార్కుల్లో రహదారులు, విద్యుత్, డ్రైనేజ్తో పాటు పూర్తి మౌలిక సౌకర్యాలు కల్పించేలా జిల్లా అధికారులు హెడ్ ఆఫీస్ చీఫ్ ఇంజనీర్లతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. ఏపీఐఐసీ జోనల్ అధికారులు పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు హెడ్ ఆఫీస్తో సమన్వయం చేసుకుంటూ నివేదికలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. చీఫ్ ఇంజనీర్లు మరియు జోనల్ మేనేజర్ల మధ్య సమన్వయం లేకపోతే పార్కుల నిర్మాణం అనుకున్న టైంలో పూర్తి కాదని హెచ్చరించారు. పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న పార్కుల స్థితిగతులను ఎప్పటికప్పుడు డ్యాష్బోర్డులో పొందుపరచాలని వీసీఎండీని ఆదేశించారు. 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఔత్సాహికులకు నిర్ణీత సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలో ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి అనుగుణంగా ఏపీఐఐసీ & పరిశ్రమల శాఖ వేగంగా పని చేయాలని మంత్రి సుతిమెత్తని హెచ్చరిక జారీ చేశారు. అలాగే ఈ నెల 25న విజయవాడ స్వరాజ్ మైదానంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే ఎంఎస్ఎంఈ కార్యక్రమ నిర్వహణపై ఏపీఐఐసీ, ఎంఎస్ఎంఈ తీసుకోవాల్సిన కార్యాచరణ సమీక్షించారు. అదే రోజు మరిన్ని ఎంఎస్ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకువస్తారని మంత్రి ప్రకటించారు. ఈ సమీక్షలో వీసీఎండీ దినేష్కుమార్, ఏపీఎంఎస్ఎండీ డవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వ, సెక్రటరీ ఇండస్ట్రీస్ యువరాజ్, ఏపీఐఐసీ ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు, జిల్లా జోనల్ మేనేజర్లు ఆన్లైన్లో సమీక్షలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News