గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మండుతున్న ఎండల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని, మరో వారం రోజులపాటు ఇదే రీతిగా ఎండల తీవ్రత కొనసాగటంతోపాటు వడగాల్పులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ వేడిమి నుండి రక్షణ కోసం తలపై టోపీ పెట్టుకోవాలని, గొడుగు, మంచినీళ్లు సీసా వెంట తీసుకొని వెళ్ళాలని సూచించారు. ఎండ వేడిమికి తలనొప్పి, వాంతులు, నీరసం, తల తిరగడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యశాలకు వెళ్లి తగు చికిత్స పొందాలన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మధ్యాహ్న సమయంలో ఎండలో తిరగ వద్దని నీడపట్టున ఉండాలని ఎమ్మెల్యే యార్లగడ్డ సూచించారు.
Prajavartha Online Telugu News