విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుస్తకాలు చదవడమంటే మిమ్మల్ని మీరు తీర్చి దిద్దుకోవడమేనని జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె. మోహన్ కుమార్ అన్నారు. 54 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్బంగా కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోగల ఠాగూర్ స్మారక గ్రంధాలయంలో సోమవారం పుస్తక ప్రదర్శనను జెసి కె.మోహన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులుగా పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి పుస్తకమేనన్నారు. పుస్తకం అద్భుతమైన మోటివేటరని, అందుకే మహాత్ముని చేతిలో ఎప్పుడూ పుస్తకం ఉండే దన్నారు. కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కంచల నాగరాజు జాయింట్ కలెక్టర్ కె.మోహన్ కుమార్ కు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. జిల్లా విద్యాశాఖాధికారి తహెరా సుల్తానా పుస్తక ప్రదర్శన ఏర్పాట్లు చూసి గ్రంధాలయాధికారిని ప్రశంసించారు. కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రామచంద్రుడు, కళ్లేపల్లి మధుసూదన రాజు, సిహెచ్,రామకృష్ణ, రమేష్..నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, కోశాధికారి చొప్పా రాఘవేంద్ర శేఖర్, విద్యార్థినీ, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల్లో సందర్భంగా స్వాతంత్ర్య సమరంలో తెలుగు వారి పాత్ర మరియు సమగ్రత, – సమైక్యత భారతదేశ పరిరక్షణ అనే అంశాలపై విద్యార్థినీ, విద్యార్థులకు జూనియర్, సీనియర్ విభాగాలకు వ్యాస రచన పోటీలు జరిగాయి. ఈ కార్యక్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కొండా రవికుమార్, దామెర్ల నరసింహారావు (టీచర్) పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కంచల నాగరాజు పర్యవేక్షించారు. ఈ పోటీలకు వివిధ విద్యాసంస్థల విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News