గంపలగూడెం , నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ పాల కేంద్రాలకు పాల సేకరణ మరింత పెరగేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నుపూర్ శ్రీనివాస్ అజయ్ కుమర్ ప్రమోటర్లు, అధికారులను ఆదేశించారు. గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామంలో జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రాన్ని గురువారం జేసీ సందర్శించి, ప్రమోటర్లు, పాడిరైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నుపూర్ శ్రీనివాస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పథకం పాడి రైతుల పాలిట వరమని, జిల్లాలో జగనన్న పాలవెల్లువ పధకానికి పాడి రైతుల నుండి మంచి స్పందన లభిస్తున్నదన్నారు. , పాడి రైతులు ప్రైవేట్ పాల డైరీలకు కాకుండా జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తున్నారన్నారు. ఇదే ఒరవడి కొనసాగేలా పాల సేకరణ మరింత పెంచాలని ప్రమోటర్లు, అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ పాల డైరీలకు పాలు అందజేసి సమయంలో వెన్న శాతం కొలవడంలో తేడాలను గుర్తించామని, ప్రైవేట్ డైరీలలో 5 నుండి 6 శాతం వరకు మాత్రమే వెన్న శాతం వచ్చేదని, కానీ అవే పాలకు జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రంలో 9 శాతానికి పైబడి వెన్న శాతం చూపిస్తున్నారన్నారు. కంప్యూటరైజ్డ్ వెన్న శాతం కొలిచే యంత్రాలతో ఖచ్చితత్వం తో కూడిన వెన్న శాతం తెలుస్తున్నదని, తాము ఇకనుండి జగనన్న పాలవెల్లువ పాల కేంద్రానికే పాలు సరఫరా చేస్తామని జిల్లాలోని పాడి రైతులు తెలియజేసారన్నారు. ఈ పధకం ప్రయోజనాలపై పాడి రైతులందరకు అవగాహన కలిగించాలని ప్రమోటర్లు , సిబ్బందికి సూచించారు. అనంతరం పాల సేకరణ, వెన్న శాతం కొలిచే యంత్రాల పనితీరును పరిశీలించి, మహిళా పాడి రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను గురించి జేసీ అడిగి తెలుసుకున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్ధిదారులకు తెలియజేసి వారు సద్వినియోగం చేసుకునేలా వాలంటీర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ వై.. నాగమణి ఎంపిటిసి కె.రాధమ్మ , పంచాయతీ సెక్రటరీ విజయవర్ధనరావు, స్థానిక ప్రముఖులు గొల్ల కరుణకుమార్, ప్రమోటర్లు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News