విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ , సుప్రవ హరిచందన్ దంపతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు భేటీ అయ్యారు, సోమవారం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. గవర్నర్ ను వెంకటేశ్వర స్వామి మెమోంటో, దుశ్సాలువాతో సత్కరించారు. దాదాపు గంట సేపు గవర్నర్, ముఖ్యమంత్రి ఏకాంతంగా సమావేశం అయ్యారు. సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశం నేపధ్యంలో రాష్ట్రంలో పెద్దయెత్తున అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి సిఎం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు. అమరావతిలో రూ.40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ నిర్మించిన, ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా గవర్నర్ను జగన్ ఆహ్వానించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆ సందర్భంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పలు కీలక బిల్లులపైనా గవర్నర్తో జగన్ చర్చించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త , శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్ , విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, ఎన్ టిఆర్ విజయవాడ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, డిసిపి జాషువా, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్య రెడ్డి, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News