గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థలో పని చేసే కార్మికులు ప్రమాదవశాత్తు లేదా సాదారణంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు నగరపాలక సంస్థ నుండి అందాల్సిన నష్ట పరిహారాలు, ఇతర ప్రయోజనాలు 15 రోజుల్లోపు అందేలా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ విభాగంలో పని విధులు నిర్వహిస్తూ మరణించిన తోకల కిషోర్ కుమార్ భార్య రత్న కుమారి కి ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షలు, మట్టి ఖర్చులు రూ.15 వేల చెక్ ను కమిషనర్ అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ విభాగాలలో ప్రమాదవశాత్తు లేదా సాదారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు 15 రోజుల నిర్దేశిత కాల పరిమితిలో నగరపాలక సంస్థ నుండి అందాల్సిన పరిహారాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్స్ గ్రేషియా, మట్టి ఖర్చులు, కారుణ్య నియామకాలు ఇతర పరిహారాలు పొందేందుకు అవసరమైన ధృవీకరణ పత్రాల వివరాలను వారి కుటుంబ సభ్యులకు సంబందిత విభాగ గుమస్తా తెలియచేయాలన్నారు. ఆయా కుటుంబ సభ్యులు కూడా తమకు రావాల్సిన పరిహారాల గూర్చి సిబ్బంది ఇబ్బందులకు గురి చేసినా ప్రతి గురువారం తమ చాంబర్ లో నిర్వహించే మీట్ ది కమిషనర్ లో నేరుగా తమకు ఫిర్యాదు ఇవ్వవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ఎఫ్.ఎస్.సి.) డి.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News