గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సమస్యల పై ప్రజల నుండే అందే ఫిర్యాదుల పరిష్కారం నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని 103 కంప్లైంట్ సెల్ ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత కంప్లైంట్ సెల్ కి ప్రతి రోజు ఎన్ని ఫిర్యాదులు అందుతున్నది, వాటి పరిష్కారం, ఫిర్యాదుల రికార్డ్ తదితర వివరాలు అడిగి తెలుసుకొని, రిజిస్టర్లను తనిఖీ చేసి, ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్ చేసి సమస్యపై ఎప్పడు ఫిర్యాదు చేసింది, పరిష్కారం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబందిత సిబ్బందితో కమిషనర్ మాట్లాడుతూ ప్రతి రోజు ప్రజల నుండే కాల్ సెంటర్ లేదా వాట్స్ అప్ కు అందే ఫిర్యాదులను క్రమపద్దతిలో రిజిస్టర్ లో నమోదు చేసి, ఆయా విభాగ అధికారులకు పంపాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం అయ్యాక తప్పనిసరిగా ఫిర్యాదుదారుకు తెలియచేయాలన్నారు. అలాగే వార్డ్ సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు స్పందన జరగాలని, సేవల కోసం సచివాలయంకు వచ్చే ఆర్జీలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేసి ఉన్నతాధికారులకు పంపాలని, అర్జీకు అవసరమైన డాక్యుమెంట్స్ లేకుంటే నిర్దేశిత విధానంలో ఎండార్స్మెంట్ ఇవ్వాలని కార్యదర్శులను ఆదేశించారు. నగర ప్రజలనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ స్థానిక సమస్యల పై అందుబాటులోని వార్డ్ సచివాలయంలో అర్జీలు, ఫిర్యాదులు ఇవ్వవచ్చని, అక్కడ పరిష్కారం కాని వాటికి ప్రతి సోమవారం నగరపాలక సంస్థలో జరిగే స్పందనలో తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలాగే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ 0863-2345103 లేదా 98499 08391 కు వాట్సప్ చేయవచ్చని తెలిపారు.
Prajavartha Online Telugu News