-18 నుండి 21 సంవత్సరాలు మధ్య వయస్సు గల యువతను ఓటర్ గా నమోదు చేయాలి…
-బిఎల్ వోలు ఇంటింటి సర్వే చేసి నిర్వాసితులను ఓటర్ల జాబితాతో సరి చూడాలి….
-కలెక్టర్ యస్ డిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరినీ, ముఖ్యంగా 18 నుండి 21 సంవత్సరాల వయస్సు గల యువతకు ఓటుహక్కు కల్పించాలని, బూత్ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను, ఓటర్ల నమోదును మంగళవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఫకీర్ గూడెం లో పరిశీలించారు. నివాసం ఉంటున్న వారితో ఓటునమోదుకు సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. బిఎల్వోలు వివరాలు అడిగారా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించినందున బిఎల్వోలు ఆయా బూత్ స్థాయి పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఓట్ల జాబితాను సరి చూసి కొత్త ఓటర్ల నమోదు మార్పులు చేర్పులకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ ఈనెల ఎనిమిదో తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఓటుహక్కు నమోదుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బిఎల్వోలతో మాట్లాడి, ఓటర్ల నమోదు, ఇతర అంశాలపై ఆరా తీశారు. 17నుండి 21 సంవత్సరాల వయస్సు వారితో ఓటుకై దరఖాస్తు చేయించాలని సూచించారు. ఓటర్ డేటాకు ఆధార అనుసంధానం పూర్తి చేయాలన్నారు. నన్ను ఓటరుగా నమోదు చేయలేదని ఫిర్యాదు ఏ ఒక్కరి నుండి రానీయరాదన్నారు. ప్రత్యేక హోటల్లో జాబితాలో నమోదైన క్లైయిమ్ లను ఎప్పటికప్పుడు పరిష్కరించి 2023 జనవరి 5వ తేదీన తప్పులు లేని ఖచ్చితమైన తుది ఓటర్ల జాబితాకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. తనిఖీలో కలెక్టర్ తో పాటు తహసిల్దార్ వెన్నెల శ్రీను, బిఎల్వోలు ఉన్నారు.
Prajavartha Online Telugu News