తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా, లోక్ సభ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, ఆరవ భారత రాష్ట్రపతిగా విశేషమైన సేవలందించిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి 110వ జయంతి సందర్భంగా భారత గ్రామీణ అధ్యయనం మరియు పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ) ఈనెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్ దర్బార్ సమావేశ మందిరంలో డాక్టర్ నీలం సంజీవరెడ్డి స్మారక ఉపన్యాసం మరియు డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కారాల ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అగ్రశ్రీ సంచాలకుడు డాక్టర్ డి. సుందరరామ్ పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా పనిచేసిన డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్, డాక్టర్ నీలం సంజీవరెడ్డి ప్రధమ స్మారకోపన్యాసం చేస్తారని, అలాగే డాక్టర్ నీలం సంజీవరెడ్డి విశిష్ట రత్న రాష్ట్ర పురస్కారాన్ని స్వీకరిస్తారని డాక్టర్ సుందరరామ్ వివరించారు.
భారత గ్రామీణ అధ్యయనం మరియు పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు లోక్ సభ విశ్రాంత ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ కశ్యప్ అధ్యక్షతన జరిగిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కారాల న్యాయ నిర్ణీతల మండలి సమావేశంలో ఈ క్రింది వారిని పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కన్వీనర్ డాక్టర్ డి సుందరరామ్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మరియు రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ (విశిష్ట రత్న), ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ మాజీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి డాక్టర్ జి. ఎతిరాజులు (న్యాయ శిరోమణి), అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చొప్ప గంగిరెడ్డి (విద్యా శిరోమణి), సిమ్స్ యూనివర్సిటీలో ప్రముఖ కార్డియాలజిస్ట్ ఆచార్య డి. రాజశేఖర్ (వైద్య శిరోమణి), మరియు పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి శ్రీ జీ.వీ.కే. మల్లికార్జునరావు (పంచాయతీరాజ్ శిరోమణి) రాష్ట్ర పురస్కారాలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ నీలం సంజీవరెడ్డి 110వ జయంతి సందర్భంగా అగ్రశ్రీ ప్రచురించిన విశేష సంచికను ఆవిష్కరించనున్నట్లు డాక్టర్ డి సుందరరామ్ తెలియజేశారు.
Prajavartha Online Telugu News