-కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలం, ఆలంకొండ పర్యటనలో ముఖ్యమంత్రికి సమస్యలను విన్నవించుకున్న బాధితులు
-వారి సమస్యలు విని చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్ కు మౌఖిక ఆదేశాలు
-ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద రూ.253.72 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ అనంతరం తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధితులు కలిసి వైద్యచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కావాలని విన్నవించుకున్నారు. ఆయన బాధితుల సమస్యలను ఓపికగా విని వారితో కాసేపు మాట్లాడారు. వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ, మేమున్నామని ధైర్యం చెప్తూ ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున నలుగురికీ రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజనని
ఆదేశించారు. ఆర్థిక సహాయం తో పాటు మెరుగైన వైద్య సహాయం అంద చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం నలుగురు బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు.
ఆర్థిక సహాయం అందుకున్న వారు :-
*కర్నూలు పట్టణం నరసింహారెడ్డి నగర్ కు చెందిన ఎస్.వెంకటేశ్వర గౌడ్, ఉషారాణి దంపతుల 7 నెలల కుమారుడు నివాన్ష్ స్పైనల్ మస్కులార్ డిజార్డర్ (ఎస్ఎమ్ఏ)తో బాధపడుతున్నాడని, వ్యాధి నివారణ కొరకు ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆర్థిక సాయం నిమిత్తం లక్ష రూపాయలు చెక్ అందచేశారు..
*కృష్ణగిరి మండలం, పోతుగల్లు గ్రామానికి చెందిన టి.వెంకట రాముడు నాలుగు సంవత్సరాల నుంచి బ్రైన్ స్ట్రోక్, పక్షవాతంతో బాధపడుతున్నాడని అతని కుమారుడు టి.హరికృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యను విన్నవించుకోగా తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.. ఆ మేరకు జిల్లా కలెక్టర్ వారికి లక్ష రూపాయలు చెక్ అందచేశారు..
కృష్ణగిరి మండలం, పోతుగల్లు గ్రామానికి చెందిన బి.రామ్ ప్రసాద్ ఆరు సంవత్సరాల నుంచి వెన్నపూస సమస్యతో బాధపడుతున్నాడని అతని అన్న బి.కౌలుట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యను విన్నవించుకోగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.. ఆ మేరకు జిల్లా కలెక్టర్ అతనికి లక్ష రూపాయలు చెక్ అంద చేశారు.
*తుగ్గలి మండలం, చెన్నంపల్లి గ్రామ నివాసి తన తండ్రి ఓ.వెంకటేశ్వర రెడ్డి కి డయాలసిస్ చేయించడంతో పాటు అత్యవసరంగా కిడ్నీ అవసరం కావడంతో తన తల్లి కిడ్నీ ఇచ్చి 24వ తేదిన సర్జరీ చేయగా జులై 19వ తేది హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో మరణించారని, అందుకు సంబంధించిన బిల్లుల మొత్తాన్ని మంజూరు చేసి సహాయం చేయాలని ఓ.జనార్ధన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యను విన్నవించుకోగా తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు చెక్కును కలెక్టర్ అందచేశారు..
ఆర్థిక సహాయం అందచేసిన సందర్భంగా నలుగురు బాధితుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమంలో డి ఆర్ ఓ మధుసూదన రావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News