తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
18 సం. లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు నగర పాలక సంస్థ పరిధిలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్తినులను ఉద్దేశించి మాట్లాడుతూ 18 సం. నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరుగా నమోదు అయ్యి ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని అందులో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓటరుగా ఇంకా నమోదు కాని విద్యార్ధినుల కొరకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ లో రేపు మంగళవారం ఓటరు నమోదుకు సంబంధిత ఫారాలు, సంబంధిత అధికారులను పంపడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని సమన్వయంతో వినియోగించుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో విసి భారతి, నగరపాలక సంస్థ కమిషనర్ మరియు తిరుపతి ఈ ఆర్ ఓ శ్రీమతి హరిత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News