-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణ మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. విజయవాడ నగరానికి చెందిన చిత్రకారుడు స్ఫూర్తి శ్రీనివాస్ పిచ్చుకను చేసుకుందామా మచ్చిక అనే నినాదంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కృతిక వేదిక సంస్థల సహకారంతో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నసేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చుకల మనుగడకు కొన్నేళ్లుగా స్ఫూర్తి శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బర్డ్ హౌస్లు ఏర్పాటు చేయటం, ఆర్ట్ కాంటెస్ట్, ప్రదర్శనలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. మార్చి 20వ తేదీ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సేవ్ స్పారో నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంటెస్ట్ లో విద్యార్థులు, చిత్రకారులు పాల్గొని పర్యావరణంపై మన బాధ్యతను వ్యక్తం చేయాలన్నారు. కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఉమెన్ వింగ్ ఇన్చార్జి సంధ్యారాణి, వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రావణ్ కుమార్, బృంద సభ్యులు లక్ష్మీ ప్రియాంక, చందు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News