– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సాధారణ ఎన్నికలను నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ డిల్లీరావు.. డీఆర్వో వి.శ్రీనివాసరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా నవీకరణ, వివిధ ఫారాల పరిష్కారం, క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ, పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ), ఎన్నికల వ్యయ పరిశీలన తదితరాలపై కలెక్టర్ డిల్లీరావు వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఫామ్ 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారాన్ని వివరిస్తూ ఫారం-6కు సంబంధించి 3,571, ఫారం-7కు సంబంధించి 1,361, ఫారం-8కు సంబంధించి 2,113 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందని.. వీటిని అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించనున్నట్లు వివరించారు. గత ఎన్నికల సమాచారం ఆధారంగా క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లను గుర్తింంచి.. ఆ డేటాను విశ్లేషించి వీడియోగ్రఫీ, వెబ్కాస్టింగ్కు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ స్థలం, పోలింగ్ ఏరియా, అనుసంధానించిన మొత్తం ఓటర్లు తదితర అంశాలతో కూడిన పోలింగ్ స్టేషన్ల జాబితా (అనెక్జర్-3)ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించనున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో అమల్లోకి రానున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ), ఫిర్యాదులకు వీలుకల్పించే సీ విజిల్ యాప్, 1950 ఈసీఐ టోల్ఫ్రీ నంబర్ తదితరాల గురించి కూడా కలెక్టర్ డిల్లీరావు వివరించారు. సమావేశంలో డీవీ కృష్ణ (సీపీఐ-ఎం), వై.రామయ్య (టీడీపీ), బి.కిరణ్ (ఐఎన్సీ), కె.పరమేశ్వరరావు (ఆప్), వై.ఆంజనేయరెడ్డి (వైఎస్ఆర్సీపీ), ఎస్కే కరీం (బీజేపీ), ఎం.వినోద్ కుమార్ (బీఎస్పీ), ఎలక్షన్ సెల్ సూపరిండెంటెంట్ ఎం.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News