విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. విజయవాడ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించారు. తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజక వర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్ పాల్; మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేంద్ర సింగ్ బాలి సమక్షంలో సంబంధిత అధికారులతో కలిసి పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. 1,874 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,249 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,249 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 7,413 మంది ఓపీవోలను పారదర్శకంగా ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేశామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, సెంట్రల్ ఆర్వో స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ పశ్చిమ ఆర్వో ఇ.కిరణ్మయి, నందిగామ ఆర్వో ఎ.రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News