-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు
-ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులపై ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుల దాడి హేయమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భారీ వర్షాలు, వరదలకు నగర ప్రజలు సర్వం కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలారని.. అటువంటి వారిపై దాడికి తెగబడటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కూడా కోల్పోయారని.. పశ్చిమ ప్రాంతంలో ఎన్యుమరేషన్ జరగలేదని రోడ్డెక్కిన భవానీపురం కరకట్టవాసులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారన్నారు. తాజాగా అజిత్ సింగ్ నగర్లో సాయం కోసం వెళ్లిన వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఓవైపు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్న తరుణంలో.. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ఎన్నుకున్న ప్రభుత్వమే తమ గోడు వినకపోతే.. ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని.. దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News