గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్చ గుంటూరుకు కృషి చేస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా తదితర అంశాల్లో మోడల్ గా అభివృద్ధి చేయనున్న 49వ డివిజన్ లోని కొండయ్య కాలనీ, వేలాంగిని నగర్ ప్రాంతాల్లో ఎంఎల్ఏ గల్లా మాధవి గారు, అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించి, చేపట్టాల్సిన పనులపై సంబందిత అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చత హీ సేవాలో భాగంగా గుంటూరు నగరంలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత కోసం చేపట్టే కార్యక్రమాల్లో నగర ప్రజలను, వివిధ స్వచ్చంద, వ్యాపార సంస్థలను, విద్యార్ధులను భాగస్వాములను చేస్తున్నామన్నారు పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ గల్లా మాధవి సూచన మేరకు నగరంలో తొలుత అన్ని ఒక వార్డ్ ను ఎంపిక చేసుకొని, సదరు వార్డ్ లో ప్రజలకు అవసరమైన సమగ్ర మౌలిక వసతులు కల్పించడం, మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. త్వరలో నగరంలోని మిగిలిన వార్డ్ ల్లో కూడా చేపడతామని తెలిపారు. మోడల్ వార్డ్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే సదరు వార్డ్ లో విధుల్లో ఉన్న ప్రజారోగ్య సిబ్బందికి అదనంగా సిబ్బందిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 28వ తేదీన నగరంలో షుమారు 50 వేల మందితో స్వచ్చత హి సేవా మానవ హారం చేస్తున్నామని, నగర ప్రజలు, యువత, విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని పరిశుభ్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు కూడా కృషి చేస్తామన్నారు. మీతోనే నేను మీ వెంటే నేను పేరుతొ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో పర్యటించి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్నారు. 49వ డివిజన్లో స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. డివిజన్ ని 4 పాయింట్స్ గా విభజించి సమగ్రంగా ప్రతి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, రానున్న కాలంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
అనంతరం భారత్ పేట 1 లైన్ లో ఏర్పాటు చేసిన సభలో కమిషనర్, ఎంఎల్ఏ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల పాలన, స్వచ్చత హి సేవా కార్యక్రమాలపై ప్రజలకు వివరించి, ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్.ఎస్. ఆనంద కుమార్, ఏఈ శ్రీకాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఐజాక్, సచివాలయ కార్యదర్శులు, స్థానిక పెద్దలు మ్యానీ, రాజేష్, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News