-కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో 507 బోధన సిబ్భందిని ఒప్పంద ప్రాతిపదికన మరియు 97 బోధనేతర సిబ్బందిని పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) ప్రాతిపదికన ఒక సంవత్సర కాలానికి గానూ నియామకం కోసం పత్రికా ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎర చూపి దళారులు పైరవీలు చేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. లక్ష నుండి 5 లక్షలు చెల్లిస్తే (అడ్వాన్స్ గా 20,000/- నుండి 80,000/-) పోస్ట్ గ్యారెంటీ అని చెబుతున్నట్లుగా మా కార్యాలయం దృష్టికి వచ్చింది. ఇందు నిమిత్తం అభ్యర్ధులకు తెలియచేయడం ఏమనగా నియామకం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మెరిట్ ఆధారంగా చేపట్టడం జరుగుతుంది. ఏ పోస్టుకు కూడా మౌఖిక పరీక్షలు కాని, స్కిల్ పరీక్షలుగాని నిర్వహించబడవు. కావున ఎవరైనా దళారులు ఇంటర్వ్యూలో మార్కులు వేయిస్తామని గాని, ఉద్యోగాలు ఇప్పిస్తామని గాని ప్రలోభ పెట్టిన యెడల మీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోగానీ, రాష్ట్ర సంచాలకుల కార్యాలయం లో గాని ఫిర్యాదు చేయవలసిందిగా కోరడమైనది. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా విద్యార్హతలలో వారు సాధించిన మెరిట్ పైన మాత్రమే ఆధారపడి జరుగుతుంది. ప్రలోభాలకు గురిచేస్తున్న దళారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉద్యోగ నియామకాల గురించి ఎవరైనా దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News