-సామాన్య భక్తులకు పెద్దపీఠ
-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పై ఈ ఏడాది దసరా ఉత్సవాలను అధికారులందరి సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. గాయత్రి నగర్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తొలిసారిగా వచ్చిన దసరా పండుగను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించామన్నారు. విఐపి దర్శనాలకు ప్రత్యేక సమయం కేటాయించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు. రెవిన్యూ,దేవాదాయ శాఖ, పోలీస్ అధికారులు, కమిషనర్ ఏస్ వి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన అందరూ సమిష్టిగా ఉత్సవాలను విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లను పరిశీలించారన్నారు. చిన్న ,చిన్న సమస్యలు తప్ప ఉత్సవాలు విజయవంతంగా జరగడం ఆనందంగా ఉందన్నారు. కొన్ని లోపాలను గుర్తించామని వాటిని సరిదిద్దుకొని వచ్చే ఏడాది మరింత పట్టిష్టమైన చర్యలను చేపడతామన్నారు. తాత్కాలిక ఏర్పాట్లు ప్రతి ఏడాది చేసి తర్వాత తొలగిస్తున్నారని, ఈసారి శాశ్వత క్యూలైన్లను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. కొండపైకి అనధికారికంగా ప్రవేశిస్తున్న వాహనాలకు అడ్డుకట్ట వేసి భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. వచ్చే దసరా నాటికి మరింత పటిష్టమైన ఏర్పాట్లను నిర్వహించి సామాన్య భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యేగా దుర్గగుడి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజల నుంచి వచ్చేసలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటామని ఎమ్మెల్యే సుజనా హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News