గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషిని అధికారులు చేయాలని, ఈపిఎఫ్, ఈఎస్ఐ, ఆప్కాస్ విభాగాలు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎంఎల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎంఎల్ఏలు రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవి, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఈపిఎఫ్, ఈఎస్ఐ, ఆప్కాస్, బ్యాంకర్స్ తో కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తొలుత కార్మిక సంఘాల నాయకుల ద్వారా కార్మికులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకొని డిపార్ట్మెంట్ల వారీగా అధికారులతో మాట్లాడుతూ కార్మికుల సమస్యలను సహృదయంతో పరిష్కారం చేయాలన్నారు. ప్రధానంగా ఈపిఎఫ్ లో పుట్టినతేదీ మార్పు, రుణాల మంజూరు విషయంలో సమస్యలు రాకుండా, ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలన్నారు. ఈఎస్ఐ నుండి అందే వైద్య సేవల్లో మున్సిపల్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కృష్ణ నగర్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో తగిన మెడిసిన్ అందుబాటులో ఉంచాలన్నారు. త్వరలో ఈఎస్ఐకి సంబందించి అమరావతిలో 7 వందల పడకల అధునాతన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఈఎస్ఐ నుండి మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే జిఎంసి కార్మికుల జీతం అకౌంట్ ఉన్న యూనియన్ బ్యాంకు నుండి వ్యక్తిగత రుణాలు మంజూరుకు కమిషనర్ ఎంప్లాయర్ గా హామీ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 2వ గురువారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈపిఎఫ్, ఈఎస్ఐ ఆర్జీలపై జిఎంసి నుండి ప్రత్యేక దృష్టి సారించి, ఆయా విభాగాలతో సమనవ్యం చేసుకుంటామని తెలిపారు. అనంతరం జిఎంసి కార్మికులకు జిఎంసి ద్వారా పూర్తి ప్రీమియం చెల్లించిన ప్రమాద భీమా పత్రాలను మంత్రివర్యులు, కలెక్టర్, ఎంఎల్ఏలు అందించారు. సమావేశంలో జిఎంసి అదనపు కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, సిఎంఓహెచ్ శోభారాణి, కార్మిక సంఘాల నాయకులు వరికల్లు రవికుమార్, మాల్యాద్రి, మధుబాబు, ముత్యాలరావు, సోమి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News