-నూతన నేతన్న భరోసా పెన్షన్ దరఖాస్తులో కీలక నిబంధన మినహాయింపు
-బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు
-మాస్టర్ వీవర్ ధ్రువీకరణ పత్రం, వేతన వివరాలు అందిస్తే సరిపోతుంది
-50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు ఇస్తాం
-అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
-నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యం
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన నేతన్న భరోసా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేతలకు ఊరటనిచ్చేలా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలు బ్యాంకు స్టేట్ మెంట్ అందజేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు తీసుకున్న వివరాలు అందజేస్తే సరిపోతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని రకాల పెన్షన్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల ఏడో తేదీ నుంచి వృద్ధ్యాప్యం, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత సహా అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేతన్న భరోసా పెన్షన్ కు దరఖాస్తు చేస్తుకుంటున్న నేతన్నలకు బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధన తీవ్ర ప్రతిబంధకంగా మారింది. మాస్టర్ వీవర్ దగ్గర పనిచేసే చేనేతలకు వ్యక్తిగతంగానే వేతనాలు చెల్లిస్తూ వస్తుంటారు. అటువంటి సమయంలో బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధన పెట్టడంతో చేనేతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇదే విషయమై పలువురు నేతన్నలు, చేనేత సంఘాల ప్రతినిధులు మంత్రి సవిత దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. తక్షణమే ఆమె స్పందించి, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి చేనేతల సమస్యను తీసుకెళ్లారు. బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధనను సడలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో, అర్హులైన చేనేతలందరికీ నేతన్న భరోసా పెన్షన్లు అందజేసే అవకాశం కలిగిందని మంత్రి సవిత తెలిపారు. నూతన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ నేతన్న భరోసా పెన్షన్లు అందజేస్తామని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఆయా జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులు బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లు లేకున్నా దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది నేతన్నలకు ఉపశమనం కలగనుందని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల మందికిపైగా నేతన్నలకు నేతన్న భరోసా పెన్షన్ పథకం కింద రూ.4 వేలు చొప్పున అందజేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్, నేతన్నల సేవలో పథకం కింద ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి సవిత గుర్తు చేశారు.
Prajavartha Online Telugu News