– హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ “పుట్టగుంట”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ ప్రారంభించామని ఆ ఫౌండేషన్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని ఫౌండేషన్ చైర్మన్, లయన్ డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా కృష్ణాజిల్లాలోని అన్ని వర్గాల వారికి సాయం చేయాలనే సదుద్దేశంతో ఈ ఫౌండేషన్ ప్రారంభించామన్నారు. ఎవరైనా ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి సేవ చేయగలరని, అలాగే కుటుంబాన్ని కూడా ఆదుకోగలమనే ధీమాతో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఈ హెల్త్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తొలిదశలోనే గుర్తించి ధైర్యంగా ఎదుర్కొనేందుకు పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ ఎంతో ఉపయోగ పడు తుందన్నారు. జిల్లాల వారీగా జర్నలిస్టులకు ఆరోగ్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామన్నారు. అందుకు జర్నలిస్టు యూనియన్ నాయకుల సహకారం తీసుకుంటామని సతీష్ అన్నారు. అంతే కాకుండా ప్రెస్ క్లబ్లో పర్మినెంటుగా ఉపయోగపడే ప్రాజక్టు చేయాలనుకున్నాను. అందరికీ ఉపయోగపడే హాలు మరమ్మత్తుల కోసం అయ్యే ఖర్చును తానే విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో జర్నలిస్టులకు వాక్సిన్ అవసరమని అడిగిన వెంటనే ఆయన ఆంధ్రా హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టులకు వాక్సిన్ వేయించడం ఎంతో అభినందనీయమన్నారు. అంతే కాకుండా సేవ అంటేనే పుట్టగుంట, పుట్టగుంట అంటేనే సేవ అని నిరంతరం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, విజయవాడ అర్బన్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్ అచ్యుతబాబు, లయన్స్ సభ్యులు సాయిబాబా, రంగారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.