తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 14, 15వ తేదీలలో తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు కోసం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆహ్వానితులైన మహిళా ప్రతినిధులు మరియు వివిధ రంగాల ప్రతినిధుల సౌకర్యార్థం ప్రభుత్వం 220 వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మార్గదర్శకంలో ఈ సదస్సుకి ఏర్పాటు చేయబడిన వాహన డ్రైవర్లతో రవాణా శాఖ అధికారులు కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఈ సమావేశంలో పాల్గొన్న డ్రైవర్లకు క్రమశిక్షణతో విధేయత, అంకిత భావంతో సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని, మహిళా ప్రతినిధుల ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. విచ్చేసిన ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా మెలగాలని మంచి వేష ధారణతో మెలగాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాణాలను విధిగా పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మరియు ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట నిలబడి సదస్సు విజయవంతం కావాలని డ్రైవర్లకు స్పష్టమైన మార్గదర్శకత్వం అందించారు. మోటార్ వాహనాల తనిఖీ అధికారి అతికా నాజ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి, ప్రత్యక్ష సేవలందించడంలో ఒక మహిళగా గర్వంతో పాల్గొంటున్నామని హర్షం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News