మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నాట్య కళకు ప్రసిద్ధి చెందిన కూచిపూడి గ్రామాన్ని సుందరమైన వారసత్వ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మొవ్వ మండలం కూచిపూడి కూచిపూడి గ్రామం అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద మంజూరైన 3 కోట్ల రూపాయలు నిధులతో కూచిపూడి గ్రామాన్ని వారసత్వం గ్రామంగా సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతిపాదించిన మొదటి, రెండు ప్రాజెక్టు పనులను ఒకేసారి చేపట్టాలన్నారు.
గ్రామంలో సరైన మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటుచేసి మురుగునీరు బయటకు రాకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
వర్షపు నీరు కూడా ఎక్కడ నిలబడకుండా పైపుల ద్వారా వెళ్లే మార్గం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో ప్రవేశ మార్గం తోరణం నుండి కోనేరు వరకు రహదారి నిర్మాణానికి అంచనాలు రూపొందించాలన్నారు. గ్రామంలోని ఆసక్తి ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు కూచిపూడి నాట్య కళకు సంబంధించిన వస్తు సామాగ్రి తయారీ కోసం కుట్టు మిషన్లను పి –ఫోర్ కార్యక్రమం ద్వారా సమకూర్చాలన్నారు. గ్రామంలో ముళ్ళ పొదలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వేదిక వద్ద దుస్తులు మార్చుకునే గదులు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటికి కళాత్మకంగా ఎర్రటి రంగులు వేయించాలన్నారు. వీధి దీపాలు, అక్కడక్కడ బల్లలు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, పర్యాటకశాఖ ఏడి లజ్వంత నాయుడు, జిల్లా పర్యాటక అధికారులు రామ లక్ష్మణ్, డి ఆర్ డి ఏ పి డి హరిహరనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమేశ్వర్, పంచాయతీరాజ్ ఎస్ఇ రమణ రావు, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేశ్వరరావు, కూచిపూడి ఎంపీడీవో సుహాసిని, తహసిల్దార్ మస్తాన్, గ్రామస్తులు కొండవీటి అమర బాలేశ్వర రావు, గూగుల్ మీట్లో ఏ పి టి ఏ మార్కెటింగ్ మేనేజర్ పద్మారాణి , ఏపీటీడీసీ ఎస్ ఈ ఈశ్వరయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News