మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 10, 11 తేదీలలో ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎగ్జిబిషన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణాల యాజమాన్యాలతో సమావేశమై ఆయా తేదీలలో నిర్వహించవలసిన ఎగ్జిబిషన్ కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ 2.0) సంస్కరణల ఫలాలను ప్రజలందరూ పొందే విధంగా చూడాలని, అందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన దుకాణదారులు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో షాపింగ్ ఫెస్టివల్ మాదిరి ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్ నిర్వహించాలన్నారు. ఆయా వస్తువులు గతంలోని ధరలకు, ఇటీవల జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన ధరలను ప్రజలకు వివరించి అవగాహన కలిగించే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.
జీఎస్టీ ప్రచార కమిటీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, జాయింట్ కమిషనర్ కల్పన మాట్లాడుతూ షెడ్యూల్లో ప్రకటించిన విధంగా ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి నిర్దేశించిన ఆన్లైన్ పోర్టల్ లో కార్యక్రమ వివరాలు, ఫోటోలు అప్లోడ్ చేయాలని కోరారు.
సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ బాలాజీ బాబు, అసిస్టెంట్ కమిషనర్ సౌమ్య, ఎలక్ట్రానిక్ దుకాణాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News