మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 85 లక్షల రూపాయల గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో మత్స్యకారులకు జీవనోపాదులు కల్పించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో కేంద్ర ప్రభుత్వ గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో చేపట్టే జీవనోపాదుల కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మడఅడవుల పెంపకానికి, జీవనోపాదుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందన్నారు. జిల్లాలో 1420 ఎకరాలను మడ అడవులుగా రూపొందించేందుకు గుర్తించామన్నారు.
ఈ సంవత్సరం వినూత్నంగా 85 లక్షల రూపాయల గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో పీతలు, అలంకార చేపలు, సముద్ర నాచు పెంపకం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలన్నారు. ఇందులో భాగంగా 40 పీతల పెంపకం యూనిట్లు, 23 అలంకార చేపల పెంపకం యూనిట్లు, 25 సముద్ర నాచు పెంపకం యూనిట్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ముందస్తు పనులు అన్ని ముమ్మరంగా పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం మత్స్యకార రైతులను సంసిద్ధం చేయాలన్నారు.
ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టు మేనేజరు ఉష, డి ఎఫ్ ఓ సునీత, డి ఆర్ డి ఏ పి డి హరిహరనాథ్, మచిలీపట్నం ఆర్డిఓ స్వాతి, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా, వ్యవసాయ శాఖ ఏడి మణిధర్ పలువురు మత్స్యకార రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News