తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీనివాస మంగపురం సమీపంలోని శ్రీ వస్కోటు ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ, గత మూడు నెలలుగా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిరంతరం జరుగుతున్న అన్నదాన సేవ భక్తి, సేవాబావనలకు ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. భక్తులతో కలిసి అన్నదానంలో పాల్గొనే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. చంద్రశేఖర్ తండ్రికి కలలో అమ్మవారు దర్శనమిచ్చిన తరువాత ఆలయం ప్రతిష్టించబడడం ఎంతో విశిష్టమైన అంశమని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసం కారణంగా ఆలయానికి రోజురోజుకీ విస్తృతంగా భక్తులు వస్తుండటం సంతోషకరమని అన్నారు. గ్రామాభివృద్ధికి ఈ ఆలయం ఆధ్యాత్మిక శక్తిని అందిస్తున్నదని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, సేవకులకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి దైవకటాక్షంతో గ్రామస్తులందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News