-వన్యప్రాణి సంరక్షణలో సరికొత్త అధ్యాయం.. రాష్ట్రంలో “ప్రాజెక్ట్ హనుమాన్” ప్రారంభం
-మంత్రి కందుల దుర్గేష్
-వన్యప్రాణి సంరక్షణ, ప్రజల భద్రత, శాస్త్రీయ పర్యవేక్షణ, సమగ్ర పరిపాలన అనే నాలుగు స్తంభాలపై “హనుమాన్” కార్యక్రమం నిలుస్తుందన్న మంత్రి దుర్గేష్
-వన్యప్రాణి నిర్వహణలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కందుల దుర్గేష్
-ప్రాణనష్టం నుంచి పంటల రక్షణ వరకు.. అటవీ శాఖ వినూత్న ప్రయోగం సక్సెస్ అవుతుందని పేర్కొన్న మంత్రి దుర్గేష్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ–వన్యప్రాణి సంఘర్షణలను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో “ప్రాజెక్ట్ హనుమాన్” (హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్) కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఘనంగా మంగళగిరిలో ప్రారంభించారని పర్యాటక శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం మంగళగిరి ఏపీఎస్పీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… వన్యప్రాణి సంరక్షణా దినోత్సవం సందర్భంగా “హనుమాన్” కార్యక్రమం ప్రారంభం కావటం శుభసూచకమన్నారు. వన్యప్రాణి సంరక్షణా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అమృత హస్తాలతో “హనుమాన్” అనే వినూత్న వన్యప్రాణి సంరక్షణ మరియు ఘర్షణ నివారణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అటవీ శాఖ వినూత్న కార్యక్రమాలకు వేదికవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఏనుగుల నుంచి పంట, ప్రాణ నష్టాలను కాపాడేందుకు కర్నాటక నుంచి తెచ్చిన కుంకీ ఏనుగుల నిర్వహణ, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం సంరక్షణ చర్యలు, రాజమహేంద్రవరంలో అటవీ పరిశోధన సంస్థ కార్యక్రమాలు వంటి అనేక చర్యల ద్వారా అటవీ శాఖ ప్రజలకు చేరువ చేసిన ఘనత ఉపముఖ్యమంత్రి వారిదేనని పేర్కొన్నారు. మానవ–వన్యప్రాణి ఘర్షణ తగ్గింపే లక్ష్యం మానవ జీవన విధానం, వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించడానికి శాస్త్ర సాంకేతిక ఆధారిత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వన్యప్రాణుల వల్ల పంటలు, ఆస్తులకు కలిగే నష్టాన్ని తగ్గించడంతో పాటు, అదే సమయంలో వన్యప్రాణుల సంరక్షణను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. “హనుమాన్” కార్యక్రమం ద్వారా వన్యప్రాణులను జనసంచారం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రజల ప్రాణాలు, పంటలు, ఆస్తులను రక్షించడం వేగవంతమైన రెస్క్యూ & రిలీఫ్ చర్యలు చేపట్టడం అనే ద్వంద్వ లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమం కేవలం అటవీ శాఖకే పరిమితం కాదని, వ్యవసాయ, పశుసంవర్ధక, పర్యాటక మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని, స్థానిక సమాజం మరియు స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగుతామని చెప్పారు. ప్రజల్లో చైతన్యం అవసరం అని, మానవులు, వన్యప్రాణులు ఒకరినొకరు భయపడే పరిస్థితి రాకుండా, పరస్పర అవగాహనతో సహజీవనం చేయాలనే భావనను “హనుమాన్” కార్యక్రమం బలపరుస్తుందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగుతుందన్నారు. వన్యప్రాణి సంరక్షణ, ప్రజల భద్రత, శాస్త్రీయ పర్యవేక్షణ, సమగ్ర పరిపాలన అనే నాలుగు స్తంభాలపై “హనుమాన్” కార్యక్రమం నిలుస్తుందని, ఇది రాష్ట్రాన్ని వన్యప్రాణి నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలబెడుతుందని మంత్రి కందుల దుర్గేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News