మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు, సంక్షేమానికి సంబంధించిన సంయుక్త తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన పారిశుధ్యం, ఆరోగ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యుత్ సౌకర్యాలు, భద్రతా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వసతి గృహాల మరమ్మతులు, విద్యార్థులకు పౌష్టికాహారం, సురక్షితమైన వాతావరణం కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. వసతి గృహాల నిర్వహణపై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెబుతూ, విద్యార్థుల హాజరు శాతం, ఆహార నాణ్యతను తనిఖీ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య, విద్య, ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక, జిల్లా పంచాయితీ, మున్సిపాలిటీ, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమం తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రతి నెలా జిల్లాలో ఒక వసతి గృహాన్ని సందర్శించి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని సూచించారు.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పి వి) వ్యాక్సిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, హెచ్ పి వి వల్ల కలిగే ఇతర క్యాన్సర్లను నివారించే ఒక ముఖ్యమైన టీకా అని, ఇది ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీ, యూపీహెచ్సీలలో 14 నిండిన 15 సంవత్సరాల లోపు కిషోర బాలికలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. వసతి గృహాల్లో అట్టి వయసు కలిగిన బాలికలను గుర్తించి వ్యాక్సిన్ వేయాలని, అదేవిధంగా సచివాలయాల వారీగా గుర్తించి వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించి టీకా వేయాలని సూచించారు.
సమావేశంలో కమిటీ సభ్యులు డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, రోగనిరోధక అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు షేక్ షాహిద్ బాబు, ఫణి ధూర్జటి, జి రమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల అధికారులు చిన్న నరసింహులు, ఎన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News