-ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశ కాంగ్రెస్ శ్రేణులమంతా ఐక్యతతో పోరాడుతాం..
-జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు నిరసనగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఎం.జి. రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
అదే సందర్భంగా ఎం.జి. రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజల తరఫున గొంతుకగా నిలుస్తున్న రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హల్ద్వానీ పర్యటన అనంతరం చోటుచేసుకున్న ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని, ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దీపక్ జాన్, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు,కార్యకర్తలు, వివిధ విభాగాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News