-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జి, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాలను సందర్శించి పారిశుధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కృష్ణలంకలోని రివర్ ఫ్రంట్ పార్కులో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను అక్కడున్న ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఇటీవల నగరంలో అధిక వర్షాలు మరియు ఈదురుగాలుల ప్రభావంతో పరిశుభ్రత నిర్వహణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడా లోపాలకు తావు లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. తదుపరి కృష్ణలంక రివర్ ఫ్రంట్ పార్కులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని కామన్ యోగా ప్రోటోకాల్కు అనుగుణంగా యోగాసనాలు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగా శిక్షణా కార్యక్రమాలతో పాటు యోగా పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డు స్థాయి నుంచి నగర, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు ఈ కార్యక్రమాలు విస్తరించనున్న నేపథ్యంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాణిగారి తోటలోని అన్న క్యాంటీన్ను పరిశీలించారు. ఆహార నాణ్యత, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అలాగే త్రాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె. షమ్మీ, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇన్చార్జ్) రామారావు, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గోపాల్ నాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News