విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో దోమల నియంత్రణకు విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం సత్యనారాయణపురం మధ్యకట్ట ప్రాంతంలో బయాలజిస్ట్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను బోట్ల సహాయంతో తొలగించడంతో పాటు, కాలువ గట్లపై యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. దోమల వృద్ధికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన మందులను పిచికారీ చేశారు.
ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ, నగరంలో దోమల నియంత్రణ కోసం నిరంతరం యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఫాగింగ్, యం ఎల్ ఆయిల్ స్ప్రేయింగ్, కాలువల్లో పూడికలు తొలగించడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
అలాగే ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బందర్, ఏలూరు, రైవస్, బుడమేరు కాలువ తదితర ప్రాంతాల్లో తేలియాడే వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపు డెక్కలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు.
దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి దోమల నివారణలో నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మలేరియా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News