విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెలిపారు. ఏపీపీటీడీ కార్మిక పరిషత్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం మంగళవారం విజయవాడలో నిర్వహించారు.
ఈ సమావేశంలో కార్మికులు ర్యాలీగా గాంధీనగర్ స్థానిక శ్రీరామఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. అనంతరం జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి. శేషగిరిరావు అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి నివేదికను సమర్పించారు.
కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆర్గనైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కార్మిక పరిషత్ నాయకులు వివిధ కమిటీల ప్రతినిధులు కలిపి సుమారు 400 మంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టాభిరామ్, మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు సౌకర్యాలు ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందన్నారు. రాష్ట్రంలోని సుమారు 127 ఆర్టీసీ డిపోల్లో కార్మిక పరిషత్ను విస్తరించేందుకు సహకరిస్తామని చెప్పారు. ప్రతి డిపోలోని సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకురావాలని అవసరమైతే ఉన్నతస్థాయిలో సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నారు. కార్మిక పరిషత్కు అధికారిక గుర్తింపు సాధించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో అండగా ఉంటామని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడు శేషగిరిరావు మాట్లాడుతూ యూనియన్ను మరింత బలోపేతం చేయడం కార్మికుల సమస్యల పరిష్కారమే సమావేశం ప్రధాన ఉద్దేశమన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో సిబ్బంది కొరత, శ్రీశక్తి సిబ్బంది సమస్యలు వివిధ డిపోల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించినట్లు తెలిపారు. రీజినల్ డిపో కమిటీల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను సేకరించి అధికారుల ద్వారా ప్రభుత్వానికి అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీలో కార్మిక పరిషత్ పోషించిన పాత్ర పరిష్కరించిన సమస్యలు వాటి అమలు తీరుపై సభ్యులకు వివరించినట్లు తెలిపారు. డిసెంబరులో జరగనున్న ఏపీఎస్ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో కార్మిక పరిషత్ తరఫున డెలిగేట్లను గెలిపించుకునే వ్యూహంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా సీసీఎస్లో కార్మిక పరిషత్కు ప్రాతినిధ్యం ఉందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 డిపోల్లో కార్మిక పరిషత్కు సభ్యత్వం ఉందని 11–12 వేల మంది సభ్యులు ఉన్నారని నాయకులు తెలిపారు. ఇంకా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన డిపోల్లో వాటిని ఏర్పాటు చేసి యూనియన్ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు సంస్థ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News