-తాగునీటికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం
-కలెక్టర్ల గత సదస్పులో తీసుకున్న నిర్ణయాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేస్తున్నాం
-అన్ని జిల్లాల్లో భూముల లభ్యతపై ఒక సమ గ్ర వెబ్సైటు రూపొందిస్తున్నాం
-ముఖ్యమంత్రికి తెలిపిన అధికారులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అర్బన్ డేటా బేస్ను ఆర్టీజీఎస్ తో అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. సచివాలయంలో గురువారం 8వ కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖల వారిగా పురోగతి నివేదికలను సమీక్షించారు. గత సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటిపైన అధికారులు తీసుకున్న చర్యలకు సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్టులపై చర్చించారు. ఇంకా పాక్షింగా పూర్తి చేయాల్సిన పనులను తక్షణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తమ తమ శాఖల్లో జరిగిన ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ అర్బన్ డేటా బేస్ను ఆర్టీజీఎస్తో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి 15 రోజుల్లో అనుమతులు వస్తాయని వచ్చిన వెంటనే ఈ డేటాబేస్ను ఆర్టీజీఎస్ తో అనుసంధానిస్తామని చెప్పారు. ప్రభుత్వం వద్ద ఎంత భూములున్నాయి, జిల్లాల వారీగా ఎంతెంత భూముల లభ్యత ఉందనే దానిపై సమగ్ర వివరాలతో ఒక వెబ్ సైటును రూపొందిస్తున్నట్లు సీసీఎల్ ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం ఒక కామన్ స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా ఏఏ ప్రాంతంలో ఎంత భూమి అందుబాటులో ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది తదితర అన్ని వివరాలు ఇందులో ప్రత్యక్షంగా తెలుసుకునే సదుపాయముంటుంది. గృహ నిర్మాణ శాఖలో గృహ నిర్మాణ పనులు ఆగిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖతో నిరంతరం సంప్రదింపులు జరిపి గృహ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ మంచినీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మంచినీటి సమస్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. దీనికోసం జిల్లాల్లో పలు అత్యవసర పనులు చేపట్టామన్నారు.
Prajavartha Online Telugu News