చిత్తూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుప్పం, చిత్తూరు, పలమనేరు ప్రాంతాల్లో నిర్వహించిన సన్నాహక కార్యక్రమాల్లో తిరుపతి–చిత్తూరు కోఆర్డినేటర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీ శ్రేణులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కార్యాచరణను రూపొందించుకోవాలని, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.
డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, కుప్పం, చిత్తూరు, పలమనేరు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పార్టీ సన్నాహకాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిపై సంబంధిత స్థాయిలో చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని హరిప్రసాద్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన తెలిపారు. ఎన్నికల విధులు, బాధ్యతలపై కార్యకర్తలకు స్పష్టత కల్పిస్తూ కార్యక్రమాలను క్రమబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పట్టణాల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు తదితర స్థానిక అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని సంబంధిత వేదికలపై ప్రస్తావించాలని డా. పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News