అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి సందర్భంగా స్పైస్ ఇన్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, వినాయక చవితి సందర్భంగా విజయవాడ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతి విగ్రహాలను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. విజయవాడలో గత మూడు సంవత్సరాలుగా మట్టి గణపతి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అధికారులతో వెంటనే మాట్లాడి చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
గతంలో వినాయక చవితి వేడుకలకు ముంబై, హైదరాబాద్ వంటి నగరాలు గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు విజయవాడలో కూడా అదే స్థాయిలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని ఎంపీ చిన్ని అన్నారు. 72 అడుగుల భారీ ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహం విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు.విజయవాడ మత సామరస్యానికి ప్రతీక అని, అన్ని మతాల ప్రజలు పరస్పర సోదరభావంతో అన్ని పండుగలను కలిసి జరుపుకోవడం నగర ప్రత్యేకత అని తెలిపారు. ఈ ఐక్యత, మత సామరస్యం ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు.మట్టి గణపతి విగ్రహాల పంపిణీ వంటి పర్యావరణహిత కార్యక్రమాన్ని నిర్వహించిన స్పైస్ ఇన్ రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఎంపీ చిన్ని అభినందించారు. భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యాన్ని చాటిచెప్పే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, మాజీ కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు,చెన్నుపాటి గాంధీ, కరిముల్లా, 11 వ డివిజన్ మాజీ అధ్యక్షుడు కోనేరు రాజేష్, డివిజన్ ప్రెసిడెంట్ నాదెళ్ల రాజేష్,దర్షిత్, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News