విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 40, 50, 55 డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణ తరగతులు మరియు ముఖ్య సమావేశం ఆదివారం స్థానిక బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించి, స్పెషల్ సమ్మరి రివిజన్ మరియు ఏజెంట్లకు ఎన్నికల విధులపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, పశ్చిమ వైసిపి పరిశీలకులు మొహమ్మద్ రుహుల్లా మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి మరియు ఎన్నికల్లో ఘనవిజయం సాధించడానికి బూత్ లెవల్ ఏజెంట్లు వెన్నెముక వంటివారని కొనియాడారు. క్షేత్రస్థాయిలో ఏజెంట్లు ప్రదర్శించే పనితీరుపైనే పార్టీ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏజెంట్ తమ బూత్ పరిధిలో పార్టీకి రక్షణ కవచంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియపై ఏజెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. బూత్ లెవల్ అధికారులను (BLO) ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలో బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యంగా 2002 తర్వాత నమోదైన ప్రతి ఓటర్ ఎన్యుమరేషన్ సర్టిఫికెట్ విషయంలో ఏజెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు ప్రతి బూత్లో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, నాయకులు మరియు కార్యకర్తల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని వెలంపల్లి సూచించారు. రానున్న రోజుల్లో పార్టీ ఇచ్చే ప్రతి పిలుపును అందుకుని, ఏజెంట్లు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా పనిచేసి పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయరెడ్డి, 50వ డివిజన్ వైసిపి అధ్యక్షులు బంక విజయ, పశ్చిమ బూత్ కమిటీల అధ్యక్షులు వడ్డురి యశోధర్, క్లస్టర్ ఇంచార్జ్ వాసా ఆదినారాయణ బాబు, బంక చాము, వైసిపి నాయకులు కొనకళ్ళ విద్యాదరరావు మరియు ఆయా డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News