విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి నూతన 15 పాయింట్ల కార్యక్రమం కింద మైనారిటీల సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలో సభ్యునిగా కూరపాటి జాన్ పాల్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని కమిటీ సభ్యులు జాన్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన అన్నారు.ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ పథకాల అమలును కాలానుగుణంగా పర్యవేక్షించనుందన్నారు.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫారూఖ్, మరియు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా అందేలా తన వంతు బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తానని, ప్రత్యేకంగా క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి లబ్ధి చేకూరేలా కృషి చేస్తానన్నారు. అలాగే యువత, విద్య, ఉపాధి, సంక్షేమం వంటి అంశాల్లో శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగుతానని, తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి అంకితభావంతో నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News