రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితాను పొరపాట్లకు తావివ్వకుండా తయారు చేయాలని కమిషనరు కె.దినేష్ కుమార్, ఐ.ఎ.ఎస్. వారు పిలుపునిచ్చారు. ది.10-08-2023 వ తేదీన వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఓటర్ల సవరణ కార్యక్రమమునకు ఉపయోగించవలసిన మొబైల్ యాప్ నిర్వహణపై శిక్షణా కార్యక్రమము జాయింట్ కలెక్టరు ఎన్.తేజ్ భరత్ తో కలిసి నిర్వహించారు. ఓటర్ల యొక్క నమోదు, బదిలీ మరియు తీసివేయడంపై బూత్ లెవెల్ అధికారులకు మరియు సూపర్వైజర్లుకు శిక్షణ యిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా కీలకమైనదని, ఎన్నికలకు ప్రధాన పునాది ఓటర్ల జాబితాయేనని యిటువంటి ఓటర్ల జాబితాలను అత్యంత శ్రద్ధతో నిబద్దతతో తయారు చేయాలని అన్నారు. నూతనముగా నమోదు చేసుకుంటున్న వారిలో 25 సంవత్సరములు దాటిన వారు ఉంటే వారి యొక్క పూర్తి వివరములు అనగా గతములో ఎక్కడ ఉండేవారు ప్రస్తుత ప్రదేశములోకి ఎప్పుడు వచ్చారు అనే వివరాలు సేకరించి గతములో ఎక్కడైన ఓటు వున్నదా లేదా అనేది పరిశీలించాలన్నారు. ఓటును జాబితా నుండి తీసివేయునప్పుడు నోటీసు యివ్వాలని, ఒక వేళ ఓటరు లేకపోతే వారికి యివ్వవలసిన నోటీసును గోడకు అంటించాలని అన్నారు. ఎక్కడైనా ఓకే డోరు నెంబరు నుండి ఎక్కువ నమోదు అయివుంటే సదరు కేసులను ప్రత్యేకముగా తనిఖీ చేయాలని అన్నారు. 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. సూపర్వైజర్లు, సహాయ ఎలక్ట్రోరల్ నమోదు అధికారులు ఎప్పటికప్పుడు తమకు కేటాయించిన బూత్ లెవెల్ ఆఫీసర్ల పనితీరును పరిశీలించి దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. ఎటువంటి పొరపాటులు జరిగిన సంబంధితులపై చర్యలు తీసుకొనబడునని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ఎన్.తేజ్ భరత్ గారు మాట్లాడుతూ ఓటరు సవరణ కార్యక్రమాన్ని విమర్శలకు అతీతంగా జాగరూకతతో పూర్తి చేయాలని అన్నారు. మొబైల్ యాప్ నిర్వహణపై పలు సూచనలు చేసారు.ఈ శిక్షణా కార్యక్రమానికి కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మల్లిబాబు , అదనపు కమిషనరుపి.ఎం.సత్యవేణి, డిప్యూటి కమిషనరు జి.సాంబశివరావు, మొబైల్ యాప్ టెక్నికల్ ఆఫీసర్ మల్లిఖార్జున్ , అసిస్టెంటు రిటర్నింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు మరియు తదితరులు హాజరైనారు.
Prajavartha Online Telugu News