విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా యాత్రికులకు విశిష్ట సేవలు అందించిన హజ్ ఇన్స్పెక్టర్లు రబ్బానీ, ఉస్మాన్ భాషలను ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఘనంగా సన్మానించింది. విజయవాడ హజ్ కమిటీ కార్యాలయంలో జరిగిన అభినందన సభ లో కమిటీ చైర్మన్ హసన్ భాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు రాష్ట్ర హజ్ కమిటీ ఈవో గౌస్ పీరా అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా హసన్ భాష మాట్లాడుతూ, కేంద్ర హజ్ కమిటీ పారదర్శక విధానంలో ఎంపిక చేసిన రబ్బానీ, ఉస్మాన్ భాషలు మక్కా, మదీనాల్లో హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యుత్తమ సేవలు అందించారని కొనియాడారు. విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్లు యాత్రికుల సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, వారికి అందుతున్న సౌకర్యాలపై ప్రతిరోజూ ఆరా తీసేవారని తెలిపారు.
యాత్రికుల సేవలపై స్వయంగా వీడియో కాల్స్ ద్వారా సమీక్ష నిర్వహించామని, హజ్ యాత్ర ముగించుకుని వచ్చిన పలువురు యాత్రికులు కూడా వారి సేవలను ప్రశంసించారని చెప్పారు. దేవుని సన్నిధిలో సేవ చేయడం గొప్ప అదృష్టమని, ఆ బాధ్యతను వారు సమర్థవంతంగా నిర్వర్తించారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ మద్దతుతో హజ్ యాత్ర విజయవంతంగా సాగిందని ఆయన చెప్పారు.
ఈవో గౌస్ పీరా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో రాత పరీక్షలు, సేవా దృక్పథం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇన్స్పెక్టర్లను ఎంపిక చేసిందన్నారు. హజ్ యాత్ర సందర్భంగా సుమారు 40 రోజులపాటు యాత్రికులను కంటికి రెప్పలా కాపాడుతూ సేవలందించారని తెలిపారు.
అనంతరం చైర్మన్ హసన్ భాష, ఈవో గౌస్ పీరా కలిసి రబ్బానీ, ఉస్మాన్ భాషలను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
సన్మానానికి స్పందించిన రబ్బానీ, ఉస్మాన్ భాష మాట్లాడుతూ, హజ్ యాత్రికులకు సేవ చేసే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి హజ్ సేవలకు ఎంపిక చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News