-సంక్షేమం–అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి: దేవినేని ఉమా
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇన్చార్జిల శిక్షణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనిట్ ఇన్చార్జిలకు పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల విధులు, బాధ్యతలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
పార్టీకి బూత్, యూనిట్ ఇన్చార్జిలే క్షేత్రస్థాయిలో కీలకమైన వారధులని, ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటితో సంబంధాలు పెంచుకోవడంతో పాటు ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సామాజిక భద్రతలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటోందన్నారు. పెన్షన్లు, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి–నైపుణ్య అవకాశాలు, పేదల సంక్షేమం వంటి అనేక రంగాల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
గత పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తూ అభివృద్ధి–సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు, పరిశ్రమలకు, ఉపాధి అవకాశాలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వాస్తవాలను వివరించడంతో పాటు ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సాంకేతికత, సోషల్ మీడియాను సమర్థంగా వినియోగిస్తూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విజయాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలని సూచించారు.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలంగా ఉంటేనే ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతుందని అన్నారు.
Prajavartha Online Telugu News