గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణకు సంబందించి ఈ నెల 15 నాటికి పట్టణ ప్రణాళిక విభాగం నుండి పూర్తి క్లియరెన్స్ చేసి, డ్రైన్, రోడ్ నిర్మాణాలకు మార్కింగ్ ని ఇవ్వాలని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్, ఏపిసిపిడిసిఎల్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ నుండి హనుమయ్య కంపెనీ వరకు రోడ్ విస్తరణ పనులు విభాగాల సమన్వయంతో వేగంగా చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా విస్తరణ ప్రభావిత భవనాల తొలగింపుకు ఈ నెల 15 తుది గడువుగా పట్టణ ప్రణాళిక అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. క్లియర్ గా ఉన్న పోర్షన్లలో డ్రైన్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గుర్తించిన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు షిఫ్ట్ చేయాలన్నారు. పనులు జరిగే సమయంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, విస్తరణలో తొలగించిన చెట్లను వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఏ.సి.పి రెహమాన్, ఈఈ విష్ణు, ఏడిహెచ్ శాంతి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News