-3 దశల్లో రూ.1,519 కోట్లతో ఇ-3 రహదారి నిర్మాణం
-ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహ సముదాయాలూ రేపు పరిశీలన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్న ఇ-3 సీడ్ యాక్సెస్ రోడ్, బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు. దీంతో రాజధానిలోకి రాకపోకలు మరింత వేగవంతం, సులభతరం కానున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుంది.
34 రహదారులు… 350 కి.మీ
అమరావతిలోని ఎన్-1 నుంచి ఎన్-17 వరకు ఉన్న అన్ని ఎన్-సిరీస్ రహదారులను ఇ-3 అనుసంధానించనుంది. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర దిశల్లో గ్రిడ్ తరహాలో రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అనవసర మలుపులు లేకుండా రాజధాని ప్రాంతంలోకి నేరుగా చేరుకునేలా ఈ రహదారి వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇ, ఎన్ సిరీస్ రోడ్లలో కలిపి 34 ప్రధాన రహదారులు… మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్లో పెరగనున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని రాజధాని రవాణా వ్యవస్థకు పటిష్ఠమైన పునాది వేస్తున్నారు.
రూ.1,519 కోట్లతో 21.77 కి.మీ
దొండపాడు నుంచి ప్రారంభమయ్యే ఇ-3 రోడ్డు రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ హాస్పిటల్స్ వద్ద NH-16ను కలుపుతుంది. 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి రూ.1,519 కోట్లు వెచ్చిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్లో 9 లేన్ల రహదారి, ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్, సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. డ్రైనేజీ, మంచినీటి సరఫరా, గ్యాస్, విద్యుత్ నెట్వర్క్లకు అవసరమైన మౌలిక వసతులను కూడా రహదారి నిర్మాణంతోపాటే కల్పిస్తున్నారు. సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు, గ్రీన్బెల్ట్లతో ఇ-3ను ఆధునిక నగర రహదారిగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది.
బకింగ్ హామ్ కెనాల్పై ఉక్కు వంతెన
ఇ-3 రోడ్డును విజయవాడ–మంగళగిరి హైవేతో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్పై రూ.82 కోట్లతో 478 మీటర్ల పొడవున నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. దీనిని కూడా సీఎం చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారు. వంతెన అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలకు మెరుగైన మార్గం ఏర్పడుతుంది. కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ.. వాహనాలు సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా నేరుగా అమరావతికి చేరుకునే అవకాశం కలుగుతుంది. రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోన్న ప్రభుత్వం.. మౌలిక వసతులను వేగంగా పూర్తి చేస్తోంది. రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇ-3 రోడ్, స్టీల్ బ్రిడ్జి ప్రారంభం కావడం… అమరావతి పునర్నిర్మాణ వేగానికి మరో కీలక సంకేతంగా నిలవనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు
ఉదయం 10.20 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. 10.35 గంటలకు శిలాఫలకం ఆవిష్కరిస్తారు. 10.45 గంటలకు ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా ప్రయాణించి రాయపూడికి చేరుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 01.25 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. సాయంత్రం 06.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
Prajavartha Online Telugu News