విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో డెమోక్రటిక్ సంగ ఆధ్వర్యంలో ‘యంగ్ లీడర్స్ ఫర్ సోషియల్ చేంజ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం బందరురోడ్డులోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ, డెమోక్రటిక్ సంగ ఆధ్వర్యంలో విద్యార్థులకు సమాజం, పలు ప్రభుత్వ విభాగాలపై అవగాహన కల్పిస్తుండడం మంచి విషయమన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సమాజం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రభుత్వ వ్యవస్థలపై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. కోర్టులు, రెవెన్యూ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు ఎలా పని చేస్తున్నాయి? ప్రజాస్వామ్యంలో పౌరుల బాధ్యత ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ సేవలపై అవగాహన ఎలా పెంచుకోవాలి? వంటి అంశాలను విద్యార్థు లకు తెలియజేయాలన్నారు. మన విద్యార్థులు ఐఐటీ, వైద్య కోర్సులపై ఆసక్తి చూపుతున్నట్లుగా పబ్లిక్ సర్వీసులపై చూపడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నతాధికారిగా కావాలంటే శిక్షణ కేంద్రాలకు వెళ్లి పోటీ పరీక్షల్లో నెగ్గి కొలువు సాధించవచ్చన్నారు.
డెమోక్రటిక్ సంగ కో ఫౌండర్, ప్రముఖ నటి రెజీనా కసాండ్రా మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయుల చొరవతో పార్లమెంటు సందర్శనను నిర్వహించామన్నారు. ఈ సందర్శన ద్వారా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ విధానం, ప్రజా సంస్థల పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. చదువుకోవడం, మార్కులు సాధించడం కాదు.. అన్ని అంశాలపై విద్యార్థికి అవగాహన ఉంటేనే పరిపూర్ణత సాధించిన వారు అవుతారన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రపంచంలోనే అగ్రభాగంగా నిలిపేలా యువత పాటు పడాలని కోరారు. అనంతరం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగ వ్యవస్థాపకుడు ఎంఆర్ఎస్కే చైతన్య, వైఎల్ఎస్సీ విజయవాడ మెంటార్ పెద్ది యశస్విని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News