-వేగంగా నీటి నిల్వల తొలగింపు – ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో వర్షాలు ప్రారంభమైన వెంటనే మాన్సూన్ రెస్పాన్స్ టీం అప్రమత్తమై వేగవంతమైన చర్యలు చేపట్టింది. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, వర్షం కురిసిన వెంటనే ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది.
ఆదివారం మధ్యాహ్నం నగరంలో వర్షం కురిసిన నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, శాఖాధిపతులు, ఇంజినీరింగ్ మరియు పారిశుధ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. నీటి నిల్వలు ఏర్పడిన ప్రాంతాలను గుర్తించి, ఎయిర్టెక్ మెషిన్లను వినియోగించి వర్షపు నీటిని వేగంగా తొలగించారు.
పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, లబ్బీపేట, బ్రిడ్జి ప్రాంతం, నిర్మల కాన్వెంట్ రోడ్, బందర్ రోడ్ తదితర ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, నీటి నిల్వలు ఎక్కువసేపు ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టారు. వర్షం తగ్గిన వెంటనే అత్యల్ప సమయంలోనే నిల్వ ఉన్న నీటిని తొలగించి ట్రాఫిక్కు, పాదచారులకు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
వర్షాకాలంలో నగరంలో నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. వర్షం ప్రారంభమైన వెంటనే స్పందించేలా మాన్సూన్ రెస్పాన్స్ టీంలను అప్రమత్తంగా ఉంచడంతో పాటు, అవసరమైన చోట్ల యంత్రాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News