-యువత సృజనాత్మకతకు కంటెంట్ క్రియేషన్ స్టూడియో వేదిక
-‘లోకల్ టాలెంట్ – లోకల్ ఇన్కమ్’కు ప్రోత్సాహం
-పర్యాటక, సాంస్కృతిక వైభవానికి డిజిటల్ ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంటెంట్ క్రియేషన్ స్టూడియో, ల్యాబ్లను యువత, మహిళలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
‘ఆరెంజ్ ఎకానమీ’లో భాగంగా సృజనాత్మకత, డిజిటల్ మీడియా, పర్యాటకం, సంస్కృతి, ఉపాధిని అనుసంధానం చేస్తూ యువతకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కంటెంట్ ల్యాబ్లో వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, లైవ్ స్ట్రీమింగ్ వంటి ప్రొఫెషనల్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కంటెంట్ తయారీ, వీడియో చిత్రీకరణ, ఎడిటింగ్, కథనం, బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగంపై శిక్షణ అందిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు, గ్రామీణ యువతలోని ప్రతిభను గుర్తించి ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలుగా మలచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, పండుగలు, స్థానిక వంటకాలు, జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలను డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేలా నాణ్యమైన కంటెంట్ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. తద్వారా ‘లోకల్ టాలెంట్ – లోకల్ ఇన్కమ్’తో పాటు జిల్లాకు విస్తృత పర్యాటక, సాంస్కృతిక ప్రచారం లభిస్తుందన్నారు. కంటెంట్ స్టూడియో, ల్యాబ్ వినియోగం, శిక్షణకు సంబంధించిన వివరాల కోసం కంటెంట్ ల్యాబ్ నిర్వాహకులు బివి రామకృష్ణ – 9885202025ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Prajavartha Online Telugu News